Monday, May 5, 2008

మాటల్లో సంక్షేమం, చేతుల్లో సంక్షోభం!

మల్లెపల్లి లక్ష్మయ్య
అక్రమంగా అసైన్డ్‌భూములను కలిగివున్నవారికి వాటిని క్రమబద్ధీకరించరాదని ఈ నెల ఒకటవ తేదీన రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టానికి ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన సవరణను వ్యతిరేకిస్తూ, అది రాజ్యాంగపరంగా చెల్లదని, అంతేగాక ఈ సవరణ చట్టం మౌలిక స్వభావానికి విరుద్ధమని ప్రముఖ న్యాయవాది బొజ్జా తార కం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతిస్తూ హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఇలా ఉంటే, అక్రమంగా ఆధీనంలో ఉంచుకున్న అసైన్డ్‌ భూములను ఎవరికివారుగా అప్పగిస్తే ఎటువంటి శిక్షలు ఉండవని విధించిన గడుపు ఏప్రిల్‌ 29వ తేదీతో ముగిసింది. కానీ ఎవ్వరూకూడా అప్పగించిన దాఖలాలు లేవు. అయితే రాష్ట్ర రెవెన్యూ అధికారులు ఎవరి దగ్గర ఎంత అసైన్డ్‌ భూమి ఉన్నదనే వివరాలను సేకరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాలకే పరిమితమైతే కొంత ఆశ కలుగకమానదు. కానీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.
చాలాచోట్ల పేదలు ముఖ్యంగా దళితులు తమ చేతుల్లో ఉన్న భూములను కోల్పోతున్నారు. గతంలో ఎవరో ప్రైవేటువ్యక్తులు దళితుల భూమిని ఏదోవిధం గా ఆక్రమించుకునేవారు. కానీ నేడు ప్రభుత్వమే ఆ పని చేస్తున్నది. దానివల్ల ఇంకా తొందరగా పేదలు, దళితులు, ఆదివాసులు తమ చేతుల్లో ఉన్న భూములను కోల్పోతున్నారు. ఇక్కడే ఇటీవల అసెం బ్లీలో జరిగిన అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టానికి జరిగిన సవరణను ప్రస్తావించాలి. సవరణకు ముందు ఈ చట్టం అసైన్డ్‌ భూములు పొందినవాళ్ళకు రక్షణగా ఉండేది. కానీ ఇప్పుడు అలాకాదు. 'అన్యాక్రాంతమైన అసైన్డ్‌భూములను ప్రభుత్వం తిరిగి స్వా ధీనం చేసుకొని ఎవరికైతే కేటాయించారో వారికే తిరిగి ఇవ్వాలి' అని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే సవరణ దానికి భిన్నంగా ఉన్నది. అన్యాక్రాంతమైన అసైన్డ్‌భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని గతంలో ఎవరికైతే కేటాయించారో వారికే ఇవ్వవచ్చు, అవసరాన్నిబట్టి, ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉం చుకుని ఇతర అవసరాలకు కూడా వాడుకోవచ్చు.
ప్రైవేట్‌ వ్యక్తుల కు కూడా కేటాయించవచ్చునని మార్చారు. ఇది ప్రభుత్వ వ్యూహా న్ని తెలియజేస్తున్నది. సెజ్‌ (ప్రత్యేక ఆర్థిక మండళ్ళ) ఏర్పాటు చేయాలనే ఆలోచనను దృష్టిలో ఉంచుకునే ఈ రకమైన నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తున్నది. ప్రజా ప్రయోజనాల పేరిట ఏర్పాట య్యే ఎటువంటి సంస్థలు, పరిశ్రమలు, పార్కులు అన్నింటికీ ఎక్కువగా దళితుల భూములనే ముందుగా లాక్కున్నారు. మన హైదరాబాద్‌ నగరంలో 30 ఏళ్ళ క్రితం నిర్మించిన ఇందిరాపార్క్‌ కోసం దళితుల చేతుల్లో ఉన్న పదెకరాల భూమిని ప్రభుత్వం లాక్కున్నది. దానిపక్కనే ఉన్న ఒక ఒక ఆధిపత్యకులానికి చెందిన వ్యక్తి భూమిని ముట్టుకోనైన లేదు. ఆ వ్యక్తి ఆ భూమిని అమ్ముకుని కోట్లు సంపాదించుకున్నాడు. ఇది ఒక ఉదాహరణ. నగరం అవతల ఏర్పాటైన అనేకమైన సంస్థలు కూడా అసైన్డ్‌భూములనే తేలికగా లాగేసుకున్నాయి. ఇవేకాకుండా రియల్‌ ఎస్టేట్‌ దందా కోసం వేలా ది ఎకరాల భూదాన్‌ భూములను వ్యాపారులు దళిత రైతులనుంచి అక్రమంగా ఆక్రమించుకున్నాయి.
దీనిపై ఎన్నో కేసులు నమోదు అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు. నగరం చుట్టూ ఈ రోజు జరుగుతున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దళితుల భూములనే కబళిస్తున్నది. ఇట్లా అన్యాక్రాంతమైన భూమిని తిరిగి వారికి స్వాధీనం చేయకుండా, ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారికే ఆ భూమిని అప్పగించే ప్రయత్నం ప్రభుత్వం చేయడం శోచనీయం. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం (1989) ప్రకారం ఎవరైనా అక్రమంగా దళితుల భూములను ఆక్రమించుకుంటే, వారిపై కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్‌ చేయాల్సి ఉంటుంది. నిజానికి ము ఖ్యమంత్రి కుటుంబం ఆ ప్రాసిక్యూషన్‌కు సిద్ధం కావాల్సి ఉండింది. చట్టాన్ని గౌరవించి అలా చేసి, మిగతావాళ్ళందరిని ఆ ప్రకారం శిక్షి స్తే, ముఖ్యమంత్రి ఆదర్శనాయకుడు అయ్యేవాడు. కానీ ఆయనే చట్టంనుంచి తప్పుకోవడానికి అసైన్డ్‌ చట్టానికి సవరణ తేవడంతోపాటు, మిగతావాళ్ళందరిని రక్షించే బాధ్యతను నెత్తిమీద వేసుకున్నారు.
దీనివల్ల దళితులు, పేదలు, ఆదివాసులు అభివృద్ధిలో మ రింత కిందికి అంటే పాతాళానికి దిగబడక తప్పని స్థితి. ఇందిరమ్మ రాజ్యం నడుపుతున్నట్లు ప్రచారం చేస్తున్న ప్రభు త్వం ఆమె అనుసరించిన విధానాలకు భిన్నంగా మాత్రమేగాక, పూర్తిగా ఆ ఆనవాళ్లు లేకుండా ప్రయత్నం చేస్తున్నది. ముఖ్యంగా దళితులకు, పేదలకు ఇందిరమ్మ కాలంలోనే భూములు దక్కాయి. అది వారిలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది. దానివల్లనే ఇప్పటికే ఇందిరమ్మ పట్ల ఎస్సీ, ఎస్టీలు ఎంతో గౌరవాన్ని, భక్తిని కలిగివున్నారు. కానీ ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఇందిర మ్మ పేరును మలినం చేసేవిధంగా ఉంది. మహబూబ్‌నగర్‌జిల్లా బాలానగర్‌ మండలం పోలేపల్లి గ్రామం లో పేదలు, దళితులు ఎదుర్కొంటున్న విషయాన్ని పరిశీలిద్దాం. ఈ గ్రామం జడ్చర్లకు దగ్గరలో ఉంది. గ్రామం కొంత లోపలికి ఉన్నప్పటికీ భూములు మాత్రం బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్‌పార్కు పేరుతో ఇక్కడ దాదాపు ఎనిమిది వందల ఎకరాల భూమిని సేకరిం చింది. ఇందులో 400 ఎకరాలకుపైబడి పట్టా భూమికాగా, మిగతాది దళితులకు, లంబాడాలకు ఇచ్చిన అసైన్డ్‌ భూమి. ప్రజలంతా వ్యతిరేకించినా ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. రోడ్డుకు దగ్గరగా ఉన్న భూమి లక్షన్నరగా, కొద్దిగా లోపలికి ఉంటే లక్ష, మరికొంత లోపలికి ఉంటే 50 వేల రూపాయల ధరతో పట్టా భూములను ప్రభు త్వం తరఫున ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ సేకరించింది. అయితే దీనికి విరుద్ధంగా ఎస్సీ, ఎస్టీల దగ్గర తీసుకున్న అసైన్డ్‌భూమికి ఎకరానికి కేవలం రూ. 18 వేల ధరను నిర్ణయించారు. కానీ వీళ్ళకు చెల్లించింది మాత్రం రూ. 9 వేలేనని చెబుతున్నారు. ఇదొక కథ. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత రంగు మారింది. ఇదే గ్రీన్‌పార్కును సెజ్‌గా మార్చారు. అరబిందో, హెట్రో ఫార్మాసూటికల్‌ కంపెనీలకు ఈ భూమిని ప్రభుత్వం అమ్మివేసింది. ఎస్సీ, ఎస్టీలు, బీసీల దగ్గర రూ.18వేల నుంచి లక్షన్నర చెల్లించి స్వాధీనం చేసుకున్న భూమిని ఈ కంపెనీలకు ఎకరాకు తొమ్మిది లక్షలకు అమ్మారు.
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా ప్రభుత్వం ఇక్కడ అవతారం ఎత్తింది. ఈ తీరును ప్రజలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా సెజ్‌ల పేరుతో సేకరిస్తున్న భూమిలో ఎక్కువభాగం పేదలు, దళితులదే. చిత్తూరు జిల్లా సత్యవేడు ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి. ప్రభుత్వం ప్రజలు ముఖ్యంగా పేదల సంక్షేమం కోసం పనిచేయడానికి బదులుగా పారిశ్రామికవేత్తల, ఆధిపత్యకులాల కొమ్ముకాస్తున్నదనడానికి ఇంతకన్నా సాక్ష్యం అక్కరలేదు. ఒకవైపు భూముల ను లాక్కుంటున్నది, రెండోవైపు ఆ భూములను పేదలకు పంచుతున్నామని ప్రచారం చేసుకుంటున్నది. ప్రభుత్వం బడ్జెట్‌లో ఎక్కువశా తం నిధులను భూములున్న రైతులకు, పరిశ్రమలు ఉన్న ఆధిపత్యకులాలకు పెంచిపెడ్తూ, చట్టపరంగా రావాల్సిన నిధులను కూ డా ఎస్సీ, ఎస్టీలకు కేటాయించడం లేదు. ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడంలేదు. ఇవన్నీ ఇలా ఉంటే, తమదే సంక్షేమరాజ్యమని చెప్పుకోవడం వైరుధ్యంకాదా? ఇటువంటి విధానాలతో నడుస్తున్న ప్రభుత్వంనుంచి పేదలు, దళితులు, ఆదివాసీలు ఏదైనా ప్రయోజ నం ఆశిస్తే అత్యాశకాక మరేమవుతుంది.

No comments: